ఆంధ్రప్రదేశ్, ఆగస్ట్ 22 : ఆంధ్రప్రదేశ్ లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని చంపడమే కాక మెదడును కూడా తిన్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పంగిడిలో చిననాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక మంచి నీటి చెరువుకు కాపలాగా పనిచేస్తున్నారు.తను ఎప్పటిలాగే తన పనికి వెళ్ళగా అక్కడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి తనను అడ్డగించి అతి దారుణంగా కర్రతో తలపై బలంగా కొట్టి చంపేశాడు. అంతటితో ఆగకుండా చనిపోయిన వ్యక్తి తలను చీల్చి మెదడును తింటూ చాలా వికృతంగా ప్రవర్తించాడు. దీనిని గమనించిన స్థానికులు మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకొని పంచాయతీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.