ఇస్లామాబాద్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజసమితి గుర్తించిన సంగతి తెలిసిందే. అంతేకాక అతనిపై ప్రయాణ నిషేధాన్ని కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మసూద్ అజర్ ఆయుధాల అమ్మకాలు, కొనుగోలు చేయరాదని పాక్ ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. మసూద్ అజర్ పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను విధిగా అమలు చేస్తామని పాక్ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ ఫైసల్ మీడియాకు తెలిపారు. పుల్వామాలో జైషే ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 40 మంది జవాన్లు మృతి చెందారు. అయితే మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ విషయంలో పాక్ కు అండగా ఉన్న చైనా అడ్డుకుంది. ఎట్టకేలకు ఐక్యరాజ్యసమితి ఆదేశాలకు చైనా తలొగ్గడంతో మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. ఇది భారత్ దౌత్య విజయంగా పలు దేశాలు చెప్పాయి.