సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వుండకపోతే బహుశా ఆయనకు మనసున పట్టదు కావచ్చు. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ‘లక్ష్మీస్ ఎన్టీర్’ సినిమా విషయమై నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఆ సినిమాను విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో వర్మ ఏపీ వెళ్లి నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని మీడియాలో సంచలన ప్రకటన చేశాడు. ఏపీలో ప్రజాస్వామ్యం నశించిందంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశాడు.
ఆ వివాదం అలా కొనసాగుతుండగా ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ మీద పడ్డాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీ అధినేత అడాల్ఫ్ హిట్లర్తో ప్రధాని నరేంద్ర మోదీని పోల్చాడు వర్మ. అప్పట్లో హిట్లర్ ఓ చిన్నపాప చెవులు పిండుతున్న ఫోటోని.. ప్రధాని మోదీ ఓ విదేశీ యాత్రలో చిన్నారి చెవులు పిండుతున్న ఫోటోతో పోల్చుతూ పోస్ట్ చేశాడు. `సేమ్ టు సేమ్` అంటూ కామెంట్ కూడా చేశాడు. వర్మ తిక్క ముదిరి పాకాన పడుతోందంటూ బీజేపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది ..