న్యూఢిల్లీ, మే 02: ఫొని తుఫాన్ దూసుకువస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తుఫాన్ సమయంలో ఎదుర్కోవాల్సిన అంశాలపై ఆయన ఢిల్లీలో సమావేశం చేపట్టారు. క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు ఐఎండీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ, పీఎంవో అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఫొని తుఫాన్.. చిలక, పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ బలమైన గాలులు వీస్తున్నాయి. తీరం వెంట ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. దాదాపు అయిదేళ్ల తర్వత ఓ భారీ తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుంది.
ఫొని తుఫాన్ నేపథ్యంలో తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచే ఒడిశా తీరాన్ని పెట్రోలింగ్ చేస్తున్నట్లు కోస్టు గార్డు తెలిపారు. జాలర్లకు వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేశామన్నారు. సహాయ చర్యల నిమిత్తం సహాయక సిబ్భంది సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. విశాఖ, చెన్నైలో భారీ షిప్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రిలీఫ్ వర్క్ కోసం హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.