ఢిల్లీపై చెన్నై ఘన విజయం

SMTV Desk 2019-05-02 12:39:35  ipl 2019, csk vs dc

చెన్నై: బుధవారం రాత్రి చేపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఏకంగా 80 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన చెన్నై జట్టు సురేశ్ రైనా (59: 37 బంతుల్లో 8x4, 1x6), మహేంద్రసింగ్ ధోని (44 నాటౌట్: 22 బంతుల్లో 4x4, 3x6) దూకుడుగా ఆడటంతో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (44: 31 బంతుల్లో 4x4, 1x6) నిలకడగా ఆడినా.. అతనికి టాప్ ఆర్డర్‌ నుంచి సహకారం లభించలేదు. దీంతో.. వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఢిల్లీ జట్టు 16.2 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇప్పటికే ఈ రెండు జట్లూ 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. నెం.1 స్థానం కోసం పోటీపడ్డాయి. అయితే.. తాజా విజయంతో రెండు పాయింట్లని అదనంగా సాధించిన చెన్నై జట్టు అగ్రస్థానానికి ఎగబాకగా.. మళ్లీ ఢిల్లీ రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో పాటు మోరీస్, శ్రేయాస్ అయ్యర్‌లను స్టంపౌట్ చేసిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.