టీడీపీ నాయకురాలు, ప్రముఖ సినీనటి దివ్యవాణి వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి , టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ జగన్ వాటిపై ఏమాత్రం స్పందించకుండా వర్మకు మద్దతివ్వడాన్ని ఆమె తీవ్ర స్థాయిలో ఖండించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఫొని తుపాను, తాగు నీటి సమస్యలు.. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించకుండా వర్మకు మద్దతుగా ట్విటర్లో జగన్ పేర్కొన్న వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. రాంగోపాల్ వర్మకు దమ్ముంటే వైఎస్ కుటుంబంలో ఇటీవల జరిగిన హత్యపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. జగన్, విజయసాయి రెడ్డి చేతుల్లో వర్మ కీలుబొమ్మ అని ఆరోపించారు. వర్మ సోషల్ మీడియా ద్వారా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.