నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

SMTV Desk 2019-04-30 19:19:46  Sensex, Nifty, Stock market, Share markets

ముంభై: మంగళవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోయి 39,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,748 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల కారణంగా మార్కెట్ నష్టాల్లోనే ప్రారంభమైంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. అయితే తర్వాత డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, చివరి గంటలో కొనుగోళ్లతో సూచీలు నష్టాలను పూడ్చుకోగలిగాయి. నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఓసీ, హెచ్‌సీఎల్, టాటా స్టీల్, బీపీసీఎల్, హిందాల్కో, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, మారుతీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 29 శాతం మేర పతనమైంది. ఆర్థిక ఫలితాలు బాగులేకపోడం ఇందుకు కారణం. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్ షేర్లు మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. రియల్టీ షేర్లు కూడా పడిపోయాయి.