ఒకప్పుడు సంతానం ఎక్కువగా ఉంటె వంశం అంత పెద్దగా ఉంటుంది అని అనేక మంది పిల్లల్ని కనేవారు. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు చాలు అన్నారు. తర్వాత ఇద్దరు.. ఇప్పుడు ఒక బిడ్డే ముద్దు అంటున్నారు. కానీ ఓ మహిళ మాత్రం ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 44 మంది పిల్లలను కన్నది. పైగా ఆ పిల్లలందరి బాధ్యతను వదిలించుకుని పారిపోయాడు తండ్రి. కన్న పాపానికి ఆ తల్లి తప్పదన్నట్టు ఆ పిల్లల కడుపు నింపడానికి ఎదురైన పనల్లా చేస్తూ వారిని పోషించుకుంటోంది. ఉగాండాకు చెందిన మరియం నబతంజి(39) పిల్లల సాకడానికి పెద్ద యుద్దమే చేస్తోంది. ఆమెకు 12 ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లయింది. మూడు కాన్పుల్లో నలుగురు(క్వాడ్రప్లెట్స్, 12మంది), నాలుగు కాన్పుల్లో ముగ్గురు (ట్రిప్లెట్స్, 12 మంది), ఆరు కాన్పుల్లో కవలలతో(12 మంది) కలుపుకుని మొత్తం 36 మంది పిల్లలకు జన్మనిచ్చిందామె. పెళ్లయిన ఏడాదికే కవలలకు జన్మనిచ్చింది. అండాశయాలు (ఓవరీస్) ఉండాల్సిన దానికంటే పెద్దగా ఉన్నాయని, గర్భనిరోధకాలు వాడకుండా పిల్లలను కనాలని డాక్టర్లు చెప్పారట. దీంతో ఆమె వరుసగా పిల్లలను కనాలని డిసైడ్ అయింది.ఆమెకు 23 ఏళ్లు వచ్చేటప్పటికి 25 మంది పిల్లలకు తల్లైంది. రెండున్నరేళ్ల క్రితం ఆరో సెట్ కవలలకు జన్మనిచ్చింది. అయితే, కాన్పులో కొన్ని కాంప్లికేషన్ల వల్ల ఒక బిడ్డ చనిపోయింది. అప్పుడే భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటినుంచి పిల్లలను పస్తులు వుంచకుండా రకరకాలు పనులు చేస్తూ బాగా కష్టపడుతోందామె. వారికోసం ఆమె చేయని పనంటూ లేదు. హెయిర్ డ్రెస్సర్గా, ఈవెంట్లకు డెకరేషన్లు చేయడానికి, తుక్కు అమ్మడం, హెర్బల్ మందుల షాపు నడపడం.., ఇలా రకరకాల పనులు చేస్తూ పిల్లల పోషణను భుజాల మీద వేసుకుందామె. ఆమె అంత కష్టపడుతున్నా ఆదాయం అరకొరే అని వాపోతోంది. కన్నతల్లి తమకోసం పడుతున్న పాట్లను చూసి 23 ఏళ్ల ఆమె పెద్ద కొడుకు ఇవాన్ కిబుకా చదువు మానేసి తల్లికి సాయంగా వుంటున్నాడు.