న్యూఢిల్లీ: భారత ఆర్మీ యతి ని గుర్తించినట్లు ప్రకటించింది. యతి... భారీ శరీరంతో మంచు ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటుంది అని పురాణాల్లో ఉంటుంది. అయితే ఇది కేవలం కల్పిత పాత్ర మాత్రమేనని కొంత మంది అంటున్నా...నిజంగా భూమిపై యతి మంచుమనిషి ఉన్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తాయి. తాజాగా భారత ఆర్మీ కూడా యతి అస్థిత్వంపై ఆసక్తికర ట్వీట్ చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను భారత సైన్యం గుర్తించింది.హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్ 9న మకలు బేస్ క్యాంప్ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా యతి వే అయి ఉంటాయని ఆర్మీ ట్విటర్లో పేర్కొంది. గతంలోనూ మకలు-బరున్ నేషనల్ పార్క్ సమీపంలో యతి అడుగులు కన్పించినట్లు సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆర్మీ ట్విటర్లో పోస్టు చేసింది. అయితే ఈ ఫొటోల్లో కేవలం ఒక కాలి ముద్రలు మాత్రమే ఉండటం గమనార్హం.యతి.. అనేది ఇప్పటివరకు పురాణాల్లో, జానపద కథల్లో వినిపించే ఓ కల్పిత పాత్ర మాత్రమే. అయితే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ మంచు మనిషి సంచారం ఉన్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. మంచుపై కన్పించిన పాద ముద్రల ఆధారంగానే అప్పుడు కూడా కథనాలు రాశారు.