ఇస్లామాబాద్: ఫిబ్రవరి 14న కాశ్మీర్ లోని పుల్వామలో పాక్ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్లో తమ భూభాగంలోని బాలాకోట్లో ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్ సైన్యం సోమవారం మరోసారి వెల్లడించింది. నిజాలను తెలుసుకోవడానికి కావాలంటే భారత మీడియాను బాలాకోట్కు తీసుకెళ్లేందుకూ సిద్ధమని తెలిపింది. బాలాకోట్ దాడిపై భారత్ అసత్యాలు ప్రచారం చేస్తోందని, బాధ్యత కలిగిన దేశంగా వాటికి తాము స్పందించడంలేదని పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. బాలాకోట్ ఘటన తర్వాత రెండు దేశాల ఎయిర్ ఫోర్స్ మధ్య జమ్మూకశ్మీర్లో జరిగిన ఘర్షణలో భారత మిగ్-21 యుద్ధవిమానాన్ని కూల్చివేసిన పాక్ పైలట్లను సరైన సమయంలో సత్కరిస్తామని తెలిపారు. భారత్కు చెందిన రెండు యుద్ధవిమానాలను తాము కూల్చివేశామన్నారు. అయినా కూలిన విమానాల్లో ఒకటి తమది, రెండోది పాక్దని భారత్ చెప్పుకుంటోందని విమర్శించారు.