అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య వాగ్వాదం రోజురోజుకి అంచెలంచెలుగా పెరుగుతుంది. తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన కుటుంబరావు విజయసాయిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయిరెడ్డి దొంగ ఆడిటర్ కాదా అని ప్రశ్నించారు కుటుంబరావు. నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం ఆయనకు లేదు.. నిధులు అడిగితే జైలుశిక్ష పడుతుందని జగన్, విజయసాయికి భయమన్నారు. రాష్ట్ర అప్పులు పెరిగాయంటూ విజయసాయిరెడ్డి పిచ్చి కుక్కలా అరుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. . విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఏపీకి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే అన్న విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు కుటుంబరావు. తనను ఆర్థికమంత్రని విజయసాయి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. గతం కంటే ఈసారి రాష్ట్ర అప్పులు పెరగలేదని.. రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. సంక్షేమానికి చేస్తున్న ఖర్చుల వివరాలను అడిగితే.. వైసీపీకి మెయిల్ ద్వారా పంపుతామన్నారు.