ఎన్ని పథకాలు పెట్టినా...ఓటుకు ఇచ్చే డబ్బు మాత్రమే గుర్తుంటుంది: జేసీ

SMTV Desk 2019-04-29 13:11:06  jc divakar reddy, tdp, ysrcp, ap cm, chandrababu, ys jagan mohan reddy

అమరావతి: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్ని పథకాలు పెట్టినా.. చివర్లో ఓటుకు ఇచ్చే డబ్బు మాత్రమే గుర్తుంటుందని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టని సంక్షేమ పథకాలను చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టినా.. తిన్నాం, అరిగిపోయింది అన్నట్లే పరిస్థితి ఉందన్నారు. ఏ రోజుకు ఆ రోజు అంతే అంటున్నారు. ఐదేళ్లు చంద్రబాబు కష్టపడినా వృథానే అంటూనే.. పసుపు కుంకుమ, పింఛన్లు టీడీపీకి కలిసొస్తాయని అభిప్రాయపడ్డారు. వైసీపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చాయన్నారు జేసీ. 2014లో పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలికారని.. మొన్న కూడా తనను పార్టీలోకి పిలిచినట్లు చెప్పుకొచ్చారు. జగన్ తన స్నేహితుడి కుమారుడైనా.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించానన్నారు. చంద్రబాబు అయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే టీడీపీలో చేరానన్నారు. కులాభిమానం ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్ తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. అందుకే టీడీపీలోనే కొనసాగుతున్నామన్నారు. ఎన్నికల్లో 99శాతం మంది రెడ్డి సామాజికవర్గం వారు వైసీపీకే ఓటు వేశారని జేసీ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం బాగా కనిపించిందన్నారు జేసీ. నియోజకవర్గానికి కనీసం రూ.50కోట్లు ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ఖర్చు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఐదేళ్లలో ఎన్ని చేసినా ప్రజలు పట్టించుకోరని.. ఎన్నికలకు ముందే కలిగే లాభాలు మాత్రమే పరిగణలోకి వస్తాయన్నారు. ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు పెట్టారని బాంబు పేల్చిన జేసీ.. అనంతపురంలోనే రూ.50కోట్లు ఖర్చయిందని సంచలనానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం జేసీ కాస్త మాట మార్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని.. ఒక్క రూపాయి కూడా పంచలేదని.. తన కుమారుడి సంగతి తెలియదంటూ ట్విస్ట్ ఇచ్చారు. తాను సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేసినప్పుడు ఓటర్లకు రూపాయి ఇచ్చామని.. ఇప్పుడు ఓటుకు రూ.2వేలు ఇచ్చారని చెప్పుకొచ్చారు.చంద్రబాబు కష్టాన్ని ప్రజలు గుర్తించలేదని.. అయినా పసుపు కుంకుమ బాగా పనిచేసిందన్నారు చంద్రబాబు. ఫలితాలు రాక ముందే చేతులు ఎత్తేయట్లేదని.. కచ్చితంగా చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లొస్తాయన్నది తాను చెప్పలేనని.. సీట్లు లెక్కలేసే అంత మేధావిని మాత్రం కాదన్నారు. ఓవైపు చంద్రబాబు శ్రమ వృధానే అంటూనే.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ జేసీ ట్విస్ట్ ఇచ్చారు.