ఏపీలో కంటిన్యూ అవుతున్న సిబిఐ రైడ్స్

SMTV Desk 2019-04-28 18:29:14  CBI, SPy reddy

ఏపీలో ఆయా నేతల ఇళ్లపై ఇంకా సీబీఐ రైడ్స్ జరుగుతున్నాయి. తాజాగా నంద్యాల ఎంపీ.. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మళ్లీ నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. పరిశ్రమల స్థాపన పేరిట బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని.. తిరిగి వాటిని చెల్లించలేదన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. రుణాల ఎగవేతపై బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ... ఎస్పీవై రెడ్డి ఇంటికి వెళ్లారు.

అదేవిధంగా బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారుల బృందం ఎస్పీవై రెడ్డి నివాసంలో పలు పత్రాలను పరిశీలించింది. అంతేకాకుండా ఇదే సమయంలో నంది పైపుల పరిశ్రమకు చెందిన ఉన్నతోద్యోగుల ఇళ్లలో కూడా సీబీఐ సోదాలు జరిగాయి. దీనిపై ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందనలేదు.