న్యూఢిల్లీ, ఆగస్ట్ 21: గత రెండు నెలలుగా తరచూ ఏదో విధంగా భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్న చైనా మీడియా తాజాగా మరోసారి అదే బాట పట్టింది. గతంలో ఇండియా చేసిన ఏడు పాపాలు అంటూ ఓ వీడియోను ప్రసారం చేసిన విషయం సుపరిచితమే. కాగా, ఈ వీడియోలో భారత్ను కొనియాడుతూ ప్రారంభించి, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు ఇండియా కారణం అంటూ ముగించింది. భారత ఆర్మీ సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడింది. చైనా భూభాగంలోకి భారత్ ప్రవేశించింది అంటూ ఆరోపణలకు దిగింది. ప్రపంచంలో పురాతన నాగరికత భారత దేశం సొంతమంటూ మెచ్చుకుంటూ, యధా ప్రకారం డోక్లాం తమ దేశ భూభాగమేనని చెప్పుకుంది.