లండన్: భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇవాళ విచారించిన న్యాయస్థానం తోసిపుచ్చింది. 48 ఏళ్ల నీరవ్ మోడీ బ్యాంకు అప్పు చెల్లించకుండా భారత్ నుంచి లండన్ పారిపోయాడు. భారత్ విజ్ఞప్తి మేరకు మార్చి 19న బ్రిటన్ కోర్టు మోడీని అదుపులోకి తీసుకుంది. బ్రిటన్ పోలీసులు అతన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటికే ఓసారి బెయిల్ విషయంలో దెబ్బతిన్న నీరవ్ మోడీ మరోసారి దరఖాస్తు చేసుకున్నా, ఇక్కడి వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అతడికి వ్యతిరేక నిర్ణయాన్ని వెల్లడించింది. జైల్లో ఉన్న నీరవ్ మోడీతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. దీనిపై తదుపరి విచారణ మే 24న ఉంటుందని, ఈ కేసుకు సంబంధించిన పూర్తిస్థాయి విచారణ మే 30న జరుపుతామని లండన్ కోర్టు పేర్కొంది.