తాళం వేసిన ఇంట్లో 5 రోజులు గడిపిన ఏడేళ్ళ చిన్నారి

SMTV Desk 2019-04-25 18:46:28  girl stay in locked house in five days, narayanpet district

నారాయణపేట్: జిల్లాలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఏడేళ్ళ చిన్నారి ఐదు రోజులు తల వేసిన ఇంట్లో కేవలం నీళ్ళు తాగుతూ ఊపిరి బిగపట్టుకుని కాలం వెళ్లదీసింది. పూర్తి వివరాల ప్రకారం...నారాయణ పేట్ జిల్లా మక్తల్ పట్టణంలోని యాదవ్ నగర్ లో నివసిస్తున్న సురేష్ మహాదేవమ్మ దంపతుల కూతురు అఖిల. ఏడేళ్ల ఈ చిన్నారి 5 రోజుల నుండి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు స్థానిక పోలీసులు. అనుమానం ఉన్న ప్రతి చోటా వెతికారు. కనబడిన వారందరినీ ఆరా తీసారు. ఎక్కడ గాలించినా ఆచూకీ దొరకలేదు. తీరా పక్కింట్లోనే చిన్నారి లభ్యం కావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. సురేష్ ఇంటి పక్కనే టీచర్‌ శ్రీనివాస్ రావు ఇల్లు ఉంది. ఐదు రోజుల క్రితం ఇంటి పైకి ఎక్కి ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదావశాత్తు రేకు విరిగి పక్కింట్లో పడింది. అప్పటికే శ్రీనివాస్‌ రావు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌ వెళ్లడంతో ఈ ఐదు రోజులు చిమ్మచీకట్లోనే ఉండిపోయింది. హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాస్‌ రావు తాళం తీసి చూడగా చిన్నారి కనిపించింది. ముందుగా భయాందోళనకు గురైన ఇంటి యజమాని.. పక్కింటి సురేష్‌కు సమాచారం ఇచ్చాడు. తీరా ఆ అమ్మాయి.. తప్పిపోయిందనుకున్న అమ్మాయి ఒకరే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.