నంద్యాల, ఆగస్ట్ 20: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బలిజల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాల్చండి, ఉరితీయండి అనే సభ్యత లేని నేతను సమర్థిస్తారా? అంటూ ప్రశ్నించారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత వైసీపీ అభ్యర్థి నంద్యాలకు చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ఓట్ల కోసం జనంపై ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసాంఘిక శక్తులు కొన్ని తెదేపాకు, కాపులకు మధ్య వైరి తెచ్చేందుకు చూస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాపులు, బలిజలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీయేనని, వారికి గుర్తింపు ఇచ్చేది తమ పార్టీయేనని చంద్రబాబు చెప్పారు. 2014లో కాపు రిజర్వేషన్ల హామీ ఇచ్చానని, వారి ఆర్థిక పరిస్థితి చూశాకే పిఠాపురంలో నాడు ప్రకటన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కాపుల రిజర్వేషన్ కోసమే చిత్తశుద్దితో మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నాను అని చంద్రబాబు తెలిపారు.