భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం బిహార్ లోని దర్భంగాలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత, ప్రతిపక్షాల స్పందన తదితర అంశాలపై మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలపై ఆయన తన దైన శైలిలో విమర్శించారు . దేశ భద్రతకు బిజెపి తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత సమస్యే కాదన్నట్టు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ‘భారత్ మాతా కీ జై, వందే మాతరం అని ప్రతి భారతీయుడు నినాదాలు చేయాలని, అయితే కొందరు మాత్రం ఈ నినాదాలను సమస్యగా భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశ భద్రత పట్టించుకోని ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఆయన ప్రజలను కోరారు. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పూర్తి పోరాటం చేస్తున్నామని, ప్రజల కాపలాదారుడిగా తాను ఉగ్రవాదంపై పోరుకు అన్నివేళల్లో సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.