అయేషా మీరా హత్య కేసు దర్యాప్తు వేగవంతం

SMTV Desk 2019-04-25 13:23:29  Ayesha meera murder case, Accused Sathyambabu, CBI Interrogation

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా కేసును సీబీఐ వేగవంతం చేసింది. విజయవాడలో మకాం వేసిన సీబీఐ అధికారులు హత్య జరిగిన సమయంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను విచారిస్తూ అలాగే ఈ కేసు విచారణలో పాలుపంచుకున్న ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరికీ విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే సత్యంబాబుపై దాడి జరిగింది. చదువు పూర్తయ్యాక ఆమె హోంగార్డుగా పనిచేసి.. తర్వాత కానిస్టేబుల్‌గా ఎంపికైంది. సత్యంబాబుపై దాడికి సంబంధించిన ఆ మహిళా కానిస్టేబుల్ నుంచి వివరాలు సేకరించారు. అప్పట్లో నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ పనిచేసిన రామారావును సీబీఐ అధికారులు విచారించారు. అయేషా మీరా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబును మరో కానిస్టేబుల్ శంకర్‌తో కలిసి రామారావు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా సత్యంబాబుపై ఎలాంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి, అతడికి సంబంధించి దొరికిన ఆధారాలకు సంబంధించి కానిస్టేబుల్ శంకర్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విజయవాడలో బీ ఫార్మసీ చదువుకుంటున్న అయేషా మీరాను 2007 డిసెంబర్‌ 26న హాస్టల్ బాత్‌రూమ్‌లోనే అత్యాచారం చేసి చంపేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహం పక్కన ఉన్న ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన ప్రేమను రిజెక్ట్ చేసినందుకే అయేషా మీరాను రేప్ చేసి చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ 2008 ఆగస్టులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడిని దోషిగా నిర్ధారిస్తూ విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సత్యం బాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై బాధితుడు హైకోర్టుకు వెళ్లగా సత్యంబాబును న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితుడికి రూ.లక్ష పరిహారం అందజేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.