కొలంబో: శ్రీలంకకు బాంబు దాడుల బెడద ఇంకా పోలేదు. ముందు ముందు మరిన్ని దాడులు జరుగుతాయాని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 359కి పెరిగింది. దేశవ్యాప్తంగా అనుమానిత ప్రాంతాల్లో భద్రతా బలగాల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భద్రతను మరింత పెంచాలని, సైన్యానికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్ నిర్ణయించింది. నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 60కి పెరిగింది. దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నట్టు నిర్ధారించారు. ఐఎస్ విడుదల చేసిన ఓ వీడియోలో ఉగ్రవాది మహ్మద్ జహ్రాన్ కనిపించడంతో ఈ పేలుళ్లకు అతడే సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పాఠశాలలు, విద్యాసంస్థలను ఈ నెల 29 వరకు మూసివేస్తున్నట్టు శ్రీలంక విద్యా శాఖ మంత్రి ప్రకటించారు.