న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్న గంభీర్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే నామినేషన్ వేసే ముందు ఎన్నికల సంఘానికి తన ఆస్తి వివరాలను ఉన్నవి ఉన్నట్టుగా అన్ని వివరించాడు. గంభీర్ తన ఆస్తుల విలువను రూ.147 కోట్లుగా తను సమర్పించిన ప్రమాణ పత్రంలో పేర్కొన్నాడు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన తన ఆదాయాన్ని రూ.12.4 కోట్లుగా ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించారు. తనపై ఓ క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య నటాషా గత సంవత్సరం ఐటీ రిటర్నుల్లో తన ఆదాయాన్ని రూ.6.15లక్షలుగా పేర్కొన్నారు. గంభీర్ తర్వాత ఢిల్లీ పశ్చిమం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహబల్ మిశ్రా రూ.45 కోట్లుగా తను ఆస్తులను పేర్కొని అత్యధిక ఆస్తుల కలిగిన రెండో అభ్యర్థిగా నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఢిల్లీ దక్షిణం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, 2008 ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ తన ఆస్తుల విలువను రూ.12.14కోట్లుగా పేర్కొన్నారు. మరో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి రూ.24కోట్లుగా పేర్కొన్నారు. మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ తన వ్యక్తిగత ఆస్తి విలువ రూ.4.92 కోట్లుగా పేర్కొనడం గమనార్హం.