హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్ బోర్డు ఫలితాల తప్పిదాలపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలపై అనేక వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు దిగుతున్నాయి. ఈ తరుణంలో కెసిఆర్ సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమీక్ష సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆశోక్ పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇంటర్ ఫలితాల వివాదంపై కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఇంటర్ ఫలితాలపై నెలకొన్న వివాదాలపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను మరో రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఇక విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు, రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తు గడువు ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు మంగళవారం ప్రకటించింది.