భర్త మీద కోపంతో...కన్న కొడుకులపై పెట్రోల్ పోసి...!

SMTV Desk 2019-04-24 17:20:15  mother kills her two sons, kurnool

కర్నూలు: కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలంలో గజార సంఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి చంపింది. పూర్తి వివరాల ప్రకారం...ఎమ్మిగనూరు మండలంలోని మసీదుపురం గ్రామానికి చెందిన నరసింహులు, పద్మావతి దంపతులకు మనోజ్‌కుమార్‌(5), సంజీవ్‌(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సమస్యలతో గత కొంత కాలంగా భర్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నరసింహులు పని మీద బయటకు వెళ్లగా ఇంట్లో నిద్రిస్తున్న తన ఇద్దరు కుమారులపై పద్మావతి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. అనంతరం తను కూడా పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కాగా స్థానికులు గమనించి ఆమెను రక్షించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లల్ని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.