కొలంబో: ఆదివారం ఉదయం శ్రీలంకలోని కొలంబోలో జరిగిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికి 360కి పెరిగింది. కనీసం 45 మంది చిన్నారులు బలయ్యారని, ఇందులో ఐదుగురు విదేశీయులని యునిసెఫ్ తెలిపింది. వారిలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఎనిమిదేండ్ల వయస్సు గల బంధువు ఉన్నారు. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో 17 మంది, జోయి చర్చిలో 13 మంది, మిగతావారు ఇతర పేలుళ్లలో మరణించారని తెలిపింది. పదుల సంఖ్యలో గాయపడ్డారని వెల్లడించింది. అటు పేలుళ్లలో మృతిచెందిన భారతీయ పౌరుల సంఖ్య 10కి పెరిగింది. కర్ణాటకకు చెందిన ఏ మరేగౌడ, హెచ్ పుట్టరాజు మృతదేహాలను గుర్తించామని భారత హై కమిషన్ ట్వీట్ చేసింది. వారిద్దరూ జేడీఎస్ వారేనని కర్ణాటక సీఎం కుమారస్వామి తెలిపారు.