గుజరాత్: గోద్రా అల్లర్ల సమయంలో 22 సార్లు అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. తనకి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీచేసింది. కేసును పక్కదోవ పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో గోధ్రా రైలు దహనం తర్వాత అల్లమూకలు మైనారిటీలను లక్ష్యం చేసుకున్నాయి. దహోద్లోని రంధిక్ పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుటుంబాన్ని ఊచకోత కోశాయి. 14 మందిని చంపేసి, గర్భిణి అయిన బానోపై 22 సార్లు పాశవిక అత్యాచారానికి పాల్పడ్డాయి. ఆమె మూడేళ్ల కూతురును కూడా గాయపర్చాయి. దుర్మార్గుల బారి నుంచి తప్పించుకోడానికి బానో చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకుంది. తర్వాత ఆమె న్యాయం కోర్టు కోర్టుకెక్కింది. తనకు ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గుజరాత్ ప్రభుత్వం ఆమెకు రూ. 5లక్షల సాయం ప్రకటించింది. దీనిపై ఆమె సుప్రీం కోర్టుకెళ్లింది. బానోకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం, నివాసం కూడా కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, బిల్కిస్ బానోపై అత్యాచారానికి తెగబడిన 11 మంది యావజ్జీవ జైలుశిక్ష పడింది. దోషులను తప్పించేందుకు ప్రయత్నించి ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లకూ శిక్షలు పడ్డాయి.