పుదుచ్చేరి, ఆగస్ట్ 20: సమాజం తీరును పరిశీలిద్దాం అని చేసిన ఒక పని ఆమెను కొత్త చిక్కుల్లోకి నెట్టేసింది. వివరాల్లోకి వెళ్తే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ శుక్ర వారం రాత్రి సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై వీధుల్లో పర్యటించింది. అయితే ఈ పర్యటనతో రాత్రి పూట నడి రోడ్డుపై మహిళల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని కిరణ్ బేడీ భావించారు. దీంతో పర్యటన అనంతరం కిరణ్ బేడీ పుదుచ్చేరి మహిళలకు సురక్షితమేనని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ తరుణంలో కిరణ్ బేడీ హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించి, నిబంధనలను ఉల్లంఘించారని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనం నడుపుతున్న మహిళకానీ, కిరణ్ బేడీ కానీ హెల్మెట్ ధరించకపోవడంతో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి, ప్రజలపై జరిమానాలు విధిస్తారా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే మహిళల వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు తాను హెల్మెట్ పెట్టుకోలేదని ఆమె తెలిపినప్పటికీ విమర్శలు మాత్రం తగ్గలేదు.