కొలంబో: శ్రీలంకలో వరుసగా జరిగిన బాంబు పేలుళ్ళ దాడి కారణంగా సోమవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించనున్నట్లు సమాచారం. ఈ రోజు ఈ విషయమై అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని నియంత్రించే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సోమవారం అర్దరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించాలని నిర్ణయించిందని అధ్యక్షుని కార్యాలయ మీడియా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చర్యలు కేవలం ఉగ్రవాద నియంత్రణకు మాత్రమే పరిమితమవుతాయని, దీని వల్ల ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మీద ఎలాంటి ప్రభావం ఉండదని వెల్లడించింది. ఐతే ఈ దాడుల వెనుక స్థానిక ఉగ్రసంస్థ నేషనల్ తౌవీత్ జమాత్ సంస్థ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు శ్రీలంక ఆరోగ్య శాఖ మంత్రి రజితా సేనరత్న వెల్లడించారు. ఆ బాంబు దాడుల్లో పాల్గొన్న ఆత్మాహుతి సభ్యులందరూ శ్రీలంకకు చెందిన వారిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఆ ఉగ్రదాడుల వెనక అంతర్జాతీయ ఉగ్ర సంస్థల హస్తం ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు.