కొలంబో: ఉదయం వరుస పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంకలో ఏపీలోని అనంతపురం జిల్లా వాసులు తృటిలో బయటపడ్డారు. ఎస్ఆర్ కనస్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు నలుగురు స్నేహితులతో కలిసి మూడు రోజుల క్రితం శ్రీలంకకు విహార యాత్రకు వెళ్లారు. కొలంబోలోని షంగ్రీలా హోటల్లో టిఫిన్ చేస్తున్న సమయంలో అక్కడ బాంబు పేలుడు జరిగింది. దీంతో ఒక్కసారిగా సురేంద్ర బాబు బృందం ఉన్న హోటల్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హోటల్ అద్దం తగిలి సురేంద్ర బాబు ముక్కుకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనపై అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీలంకలోని సెల్ టవర్లు పనిచేయకపోవడంతో వారిని సంప్రదించే కుదరలేదని చెప్పారు. వీళ్లంతా ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్టు సమాచారం. అయితే, వారికి సంబంధించిన పాస్పోర్టులు హోటల్లోనే ఉండిపోయాయని తెలుస్తోంది.