భోపాల్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం మరో నేతపై వేటు వేసింది. మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, బిజెపి లోక్సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008 సెప్టెంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరేపై సాధ్వి ప్రజ్ఞా నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును సుమోటాగా తీసుకున్న ఎన్నికల అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. సాధ్వి ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించాం. దీనిపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక కోరాం. ఈ ఉదయమే ఆ నివేదిక వచ్చింది. దీన్ని పరిశీలించిన అనంతరం ఆమెకు నోటీసులు జారీ చేశాం. 24 గంటల్లోగా ఈ నోటీసులకు ఆమె సమాధానం చెప్పాలి. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నాం అని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి సదమ్ ఖడే తెలిపారు.