శ్రీలంక: శ్రీలంకలో వరుస పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుళ్లో మృతుల సంఖ్య 160కి చేరింది. 500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలతో ఒక్కసారిగా చర్చిలన్నీ రోదనలతో నిండిపోయాయి. సహాయక సిబ్బంది రంగప్రవేశం చేసి హుటాహుటిన క్షతగాత్రులను తరలిస్తున్నారు. ఆరుచోట్ల జరిగిన ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్స్లోనూ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. కొలంబోలోని భారత రాయబార కార్యాలయం సీరియల్ పేలుళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కొలంబోలో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇక ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత భారతీయ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.