హైదరాబాద్: రాష్ట్రంలో ఆగని అకాల వర్షాల కారణంగా పంట అంతా నేలమట్టం అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక మరో రెండు రోజుల పాటు వడగండ్ల వర్షం కురవనున్నట్టు తరువాయి వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సిద్ధిపేట, వరంగల్,నల్లగొండ జిల్లాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి, గట్లమల్యాల, ఖాతా, కొండంరాజ్పల్లి, ఘనాపూర్ గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. సాయంత్రం సమయంలో భారీగా ఈదురు గాలులతో కూడిన రాళ్లవర్షం కురిసింది. దీంతో వరి పైరు నేలకొరిగి గింజలు రాలిపోయాయి. అంతే కాకుండా మామిడి కాయలు నేలకు రాలి రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల చెట్లు నేలకు ఒరిగాయి. భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురువడంతో సుమారు 80 శాతం మేర పంట నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో అకాల వర్షం, గాలి దుమారంతో బొప్పాయి పంట నేలకొరిగింది.వరంగల్ జిల్లాలో ఈదురు గాలులకు మామిడి తోట కౌలు రైతులులకు అపార నష్టం జరిగింది మండలంలోని నల్లెల్ల, రాజోలు, నారాయణపురం, బలుపాల, మొగిళిచర్ల తదితర గ్రామాలలో మామిడి తోట కౌలు, రైతులు నష్ట పోయారు. హైదరాబాద్ నగరంలో వర్షం దాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.శివారు ప్రాంతాలైన హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్షుక్నగర్, ఉప్పల్, తార్నాక, ఓయూ క్యాం పస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, చార్మినార్, బహదూర్పురా, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట తో పాటు పెద్ద అంబర్పేట, అబ్దులాపూర్మెట్ భారీ వాన కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు వీచడంతో పాటు వడగళ్లు పడ్డాయి. శనివారం పడ్డ వానకు 18 చోట్ల వరదనీరు సమస్య ఏర్పడగా, 47 చోట్ల గాలులకు చెట్లు కూలిపోయాయి. కొత్తపేట, మలక్పేట, దిల్షుక్నగర్ వంటి చోట్ల కురిసిన వానకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. మధ్యాహ్నం వర్షం పడటంతో ప్రధాన రహదారులు నీటి వరదను ముంచెత్తాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. తరువాత విపత్తు నిర్వహణ బృందాలు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి వరద నీరు ఎక్కువగా నిలిచినచోట మ్యాన్హోల్ మూతలు తెరిచి నీటి పంపించారు. గౌలిగూడ చమన్, ఐఎస్ఐసదన్, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, నూర్ఖాన్ బజార్, మొగల్పురా,కామినేని ఆసుపత్రి వంటి ప్రదేశాల్లో చెట్లు నేలమట్టం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురైయ్యారు.పెద్ద ఎత్తున గాలులు వస్తాయని రోడ్డపై రాకుండా జాగ్రత్తలు పడ్డారు. దీంతో సైదాబాద్, ఫలక్నుమా,మెహిదిపట్నం, చాంద్రాయణగుట్ట, దిల్షుక్నగర్,మలక్పేట, హయత్నగర్లో గంట పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పాతబస్తీలో మూడుచోట్ల విద్యు త్ స్దంబాలు గాలికి కూలిపోయాయి 5 గంటలపాటు కరెంటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.