లక్నో : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై న్యాయవాది రవిప్రకాశ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో రాహుల్ నామినేషన్ పత్రాల తనిఖీని రిటర్నింగ్ ఆఫీసర్ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. బ్రిటన్లో రిజిస్టర్ అయిన కంపెనీ ప్రకారం రాహుల్కు ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తుందని, ఈ క్రమంలో రాహుల్ భారత పౌరుడు కాడని న్యాయవాది రవిప్రకాశ్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయన భారత్ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని రవిప్రకాశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక ఎన్నికల సంఘానికి రాహుల్ సమర్పించిన విద్యార్హత పత్రాల్లోనూ తప్పులు ఉన్నాయని, తక్షణమే ఆయన ఒరిజినల్ విద్యా పత్రాలను సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇసిని రవిప్రకాశ్ కోరారు.