అస్సాం, ఆగస్ట్ 18 : ఎడతెరపీ లేకుండా అస్సాంలో కురుస్తున్న వర్షాలకు వరదల వల్ల జన జీవనం స్తంభించిపోయింది, విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు నానా ఇబ్బందులను పడుతున్నారు. వీరి పరిస్థితే ఇలా ఉంటే ఇక నోరులేని మూగ జీవాల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఈ నేపధ్యంలో అక్కడి కజిరంగా జాతీయ పార్క్ పూర్తిగా జలమయమైంది. పార్కులో 481 కి.మీ.ల మేర నీరు చేరడం వల్ల దాదాపు 140 వరకు వన్య మృగాలు మృత్యవాత పడ్డాయి. వీటిలో ఏడు ఖడ్గమృగాలు, 122 మచ్చ జింకలు, 2 ఏనుగులు, 3 అడవి పందులు,2 లేళ్లు, 3 సాంబార్ జింకలు, ఒక అడవిదున్నతో పాటు ఒక ముళ్ళపంది కూడా చనిపోయినట్లుగా కజిరంగా జాతీయ పార్కు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిణి భల్లావ్ సైకియా ధ్రువీకరించారు. ఇవ్వన్ని వరద ప్రవాహం అధికంగా ఉండడం వల్ల నీళ్ళల్లో మునిగి చనిపోయాయని ఆయన వివరించారు.