గుంటూరు: చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు గురువారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంలను పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంలను సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని నేతలు స్పష్టం చేశారు. అభ్యర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. తమకు భారతదేశంలోని వ్యవస్థలపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారన్నారు. తమకు భద్రతపై నమ్మకం ఉందని అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఘనుడు కాబట్టే ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు.