ముంబై, ఆగస్ట్ 17 : ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ లేని వారు లేరనే చెప్పాలి. ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు కొనాలన్నా, సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, డబ్బులు పంపించాలన్న ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ అవసరం. దీంతో వచ్చే ఏడాది టెలికాం రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఓ సర్వే తెలిపింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అధికంగా డేటాను వాడుతున్న విషయం తెలిసిందే. 4జీ టెక్నాలజీ ఆవిష్కరణ, కొత్త ఆపరేటర్లు మార్కెట్లోకి రావడం, డిజిటల్ వ్యాలెట్ల ప్రవేశం, స్మార్ట్ఫోన్లు విరివిగా ఉపయోగిస్తుండడంతో టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీని వల్ల వచ్చే ఏడాది 30 లక్షల ఉద్యోగావకాశాలు అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనం స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో 5జీ రావడం, ఎం2ఎం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ గురించి అందరికీ అవగాహన ఏర్పడుతుండడంతో 2021 నాటికి వీటిలో కూడా 8,70,000 ఉద్యోగాలు వస్తాయని సర్వే నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా అప్లికేషన్ డెవలపర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్లు, హ్యాండ్సెట్ టెక్నిషియన్స్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారి అవసరం అధికంగా ఉంటుందట. సమ్మేళన వార్షిక వృద్ధి రేటులో సబ్స్ర్కైబర్ల పరంగా టెలికాం రంగం 19.6 శాతం వృద్ధిని నమోదుచేయగా, గత కొన్నేళ్లలో రెవెన్యూ పరంగా ఈ వృద్ది 7.07 శాతంగా ఉంది.