ముంబయి: ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీకి బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీంలో జట్టులో ఎంపికవుతాము అని అనుకునే వారిలో చాలా మందికి చోటు దక్కలేదు. ఈ సందర్భంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ....ఈ రెండేళ్ల కాలంలో మిడిలార్డర్పై ఎక్కువ దృష్టి పెట్టామని, అందుకే యువ ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు కల్పించామని చెప్పాడు. జట్టును ఎంపిక చేసేటప్పుడు అంబటి రాయుడు, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని , చివరికి విజయ్ శంకర్వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే చెప్పారు.‘భారత జట్టు ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాం. ఇంగ్లండ్లో పరిస్థితులు,ఆటగాళ్ల బలాబలాలు,ఫామ్ను దృష్టిలో పెట్టకుని జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుతం జట్టులో ఏడుగురు బౌలర్లున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మంది ఆల్రౌండర్లున్నారు.అందుకే ప్రస్తుత టీమిండియా మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్గా ఉంది. సెలెక్షన్లో ఐపిఎల్ టోర్నమెంట్లో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు. రిజర్వ్ ఓపెనర్గా కెఎల్ రాహుల్ను ఎంపిక చేశాం. గత కొంత కాలంగా మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి తోడుగా అనుభవజ్ఞుడయిన రవీంద్ర జడేజా ఉంటే బాగుంటుందని భావించాం’ అని ఆయన చెప్పాడు.