ముంబై: సోమవారం రాత్రి వాంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో బెంగుళూరు జట్టుకి ప్లే ఆఫ్లకు దారులన్నీ మూసుకుపోయాయి. ఈ సందర్భంగా బెంగళూరు స్పిన్నర్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ... తర్వాతి ఆరు మ్యాచ్లు గెలిచినా మేం ప్లే ఆఫ్లకు అర్హత సాధిస్తాం. గత సీజన్లో ఓ జట్టు 14పాయింట్లతోనే ప్లే ఆఫ్కు చేరుకుంది. అందుకని దారులు ఇంకా మూసుకుపోలేదు. తర్వాత జరిగేదేంటో మీకెవ్వరికీ తెలియదు అని మ్యాచ్ ఓటమి పట్ల తీవ్ర నిరాశకు గురైన చాహల్ మీడియా సమావేశంలో తెలిపాడు. మైదానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని పరుగులు చేయడం అంత తేలికేం కాదు. 18 ఓవర్ల వరకూ నేను సరిగానే బౌలింగ్ చేశానని అనుకుంటున్నా. మిగిలిన 2 ఓవర్లే మ్యాచ్ను ఘోరంగా తిప్పేశాయి. 2 ఓవర్లలో 22పరుగులు రావడం కష్టమని భావించాం. కానీ, హార్దిక్ పాండ్యా అది చేసి చూపించాడు. ఈ ఓటమి పట్ల ఏ ఒక్క బౌలర్నో నిందించడం సరికాదు. ఇది పూర్తి జట్టు ఫలితం అని చాహల్ చెప్పుకొచ్చాడు.