ముంభైకి షాక్!!!

SMTV Desk 2019-04-16 16:42:03  Alzarri Joseph, west indies cricketer, mumbai indians, ipl 2019

ముంభై: ఐపీఎల్‌ 2019 సీజన్లో ముంభై ఇండియన్స్ జట్టు తరుపున ఆడుతున్న వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ గాయం అవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు ముంబయి ఇండియన్స్ తాజాగా ప్రకటించింది. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అల్జారీ జోసెఫ్.. తొలి మ్యాచ్‌లోనే 6/12తో 12 ఏళ్ల ఐపీఎల్ రికార్డ్‌ల్ని బద్ధలుకొట్టాడు. అతను సంధించిన కొన్ని బంతులకి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ల వద్ధ సమాధానమే లేకపోయింది. దీంతో.. ముంబయి ఇండియన్స్‌కి అతను ప్రధాన బలం అవుతాడని అంతా భావించారు. ఆ మ్యాచ్‌ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లసిత్ మలింగ అందుబాటులో ఉన్నా.. అతడ్ని కూర్చోబెట్టి మరీ అల్జారీని ముంబయి ఆడించింది. కానీ ఆ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ అల్జారీ గాయపడ్డాడు. బంతిని నిలువరించే క్రమంలో.. డైవ్ చేసిన అల్జారీ.. ఔట్ ఫీల్డ్ సరిగాలేకపోవడంతో.. శరీర బరువుని భుజంపై మోపేశాడు. దీంతో.. భుజానికి తీవ్ర గాయమవగా.. వైద్యుల సూచన మేరకు టోర్నీకి దూరమైనట్లు ముంబయి ప్రకటించింది.