ఆ పీకేలకు ఓటమి...టీడీపీ పీకే విజయం : ఆదిరెడ్డి భవానీ

SMTV Desk 2019-04-16 14:37:47  aadireddy bhavani, tdp, ysrcp, janasena

రాజమండ్రి: రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి, దివంగత నేత ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ శనివారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....ఏపీలో మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పీకే అనే పదానికి విశేష ప్రాచుర్యం లభించిందని, వైసీపీ పీకే ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, జనసేన పీకే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీకి పీకే అంటే పసుపు కుంకుమ అని అన్నారు. అయితే జనసేన, వైసీపీల పీకేలు ఓడిపోయి టీడీపీ పీకే విజయం సాధిస్తుందని భవానీ ఎద్దేవా చేశారు. అంతేకాక తమ పీకేతో టీడీపీ, వైసీపీ పీకేలు ఓడిపోనున్నాయని ఆమె జోస్యం చెప్పారు. పార్టీమీద ఉన్న ప్రేమ, నా కుటుంబం మీద ఉన్న గౌరవంతోపాటు సంక్షేమ పథకాలు నమ్మి ఓట్లు వేసిన అందరికీ నేను రుణపడి ఉంటానని అన్నారు. ఈ మూడు అంశాలు తన విజయానికి కారణమవుతాయని, ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో అక్కగానో, చెల్లిగానో, బిడ్డగానో చూసి ఆదరించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను కష్టపడి పని చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భవానీ స్పష్టం చేశారు. నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దడం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, రివర్‌ ఫ్రంట్‌ వ్యూ నిర్మాణం, హెరిటేజ్‌ సిటీగా నగరాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆదిరెడ్డి భవాని హామీ ఇచ్చారు.