న్యూఢిల్లీ, ఆగస్ట్ 16 : నిన్న ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రధాని మోదీ తక్కువ సమయం ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బెంగుళూరులో జరిగిన ఒక పర్యటనలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టే మోదీ తన ప్రసంగాన్ని తక్కువ సమయంలో ముగించారని ఎద్దేవ చేసారు. అసలు దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య గురించి ఎందుకు ప్రస్తావించలేదు? గోరఖ్పూర్లోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక మృతిచెందిన చిన్నారుల విషయంపై ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. హెల్త్ బడ్జెట్ ను మోదీ ప్రభుత్వం తగ్గించిందని అందుకే పిల్లలకు అవసరమయ్యే ఆక్సిజన్ ఆసుపత్రిలో లేదని ఆరోపించారు. అంతేకాకు౦డా విదేశాంగ విధానంలో ఇంతకు ముందు భారత్కి పాకిస్థాన్, చైనాతో మాత్రమే సంబంధాలు సరిగా ఉండేవి కాదు. ప్రస్తుత౦ నేపాల్ కూడా మనకు దూరమైందని స్నేహపూర్వక దేశాలతో సైతం మోదీ ప్రభుత్వం అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.