నంద్యాల, ఆగస్ట్ 16: నంద్యాల ఉపఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో నియోజకవర్గంలో ప్రచారం దూకుడుగా సాగుతుంది. నేడు ప్రముఖ నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా వెంకటేశ్వరపురం నుంచి నంద్యాల టౌన్, గోస్పాడు, నంద్యాల రూరల్ ప్రాంతాల్లో బాలయ్య రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరపురంలో బాలయ్య మాట్లాడుతూ... నంద్యాల ఉపఎన్నిక నీతికి-అవినీతికి, న్యాయానికి-అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమే అని ఆయన అన్నారు. శిల్పా సోదరులు స్వార్థంతోనే వైసీపీలోకి వెళ్లారు ఆయన ఘటుగా విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే వారికి ఓటు అనే తూటాతో నంద్యాల ఓటర్లు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నేను కేవలం సీనీ నటుడుని మాత్రమే కాదు, ప్రజల సేవకుడిని అని బాలయ్య స్పష్టం చేశారు. బాలయ్య రోడ్ షోకు కార్యకర్తలు భారీగా మోహరించారు. కార్యకర్తల వాహనాల్లో అనుసరించగా ఆయన రోడ్ షో ముందుకు సాగింది. ప్రచార వాహనంపై బాలయ్యకు అటూ ఇటూ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా రెండో కుమార్తె మౌనికలు ఉన్నారు.