హైదరాబాద్: ఐపిఎల్-2019 సీజన్లో చివరి మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే అవకాశాలున్నాయి. చెన్నైలో ‘స్టాండ్స్ సమస్యకు పరిష్కారం లభించకపోతే ఇదే ఖాయమవుతుంది. వాస్తవానికి గత ఏడాది సూపర్ కింగ్స్ విజేతగా నిలవడంతో చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగాలి. అయితే చిదంబరం స్టేడియంలో ఏడేళ్లుగా కొనసాగుతున్న ‘స్టాండ్స్ వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ మధ్య గొడవ కారణంగా ఏ మ్యాచ్ జరిగినా కూడా మూడు స్టాండ్లు అప్పటినుంచి ఖాళీగానే ఉంటున్నాయి. అయితే దీనిని తేల్చుకునేందుకు అసోసియేషన్కు సిఓఏ వారం రోజులు గడువిచ్చింది. ‘మూడు స్టాండులు అంటే 12వేల మంది ప్రేక్షకులు. ఇంతమంది కనిపించకపోతే మైదానం బోసిపోతుంది. ప్లేఆఫ్కు సొంత మైదానంలో ఆడే అవకాశం చెన్నై కోల్పోరాదని మేమూ కోరుకుంటున్నాం. అయితే క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురాకపోతే 2018 రన్నరప్ హైదరాబాద్లోనే ఫైనల్ నిర్వహిస్తాం. ప్లే ఆఫ్ మ్యాచ్లు బెంగుళూరులో…జరుగుతాయని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.