ముంబయి: టీమిండియా వైస్ కెప్టెన్, ఐపీఎల్ ముంభై ఇండియన్స్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగనున్న మ్యాచ్ కోసం రోహిత్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైనట్లు తెలుస్తోంది. సాధనలో భాగంగా మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేసే క్రమంలో కుడికాలు కండరాలు పట్టేశాయి. దాంతో నొప్పి కారణంగా మైదానం విడాడు రోహిత్. కాగా, రోహిత్కు పెద్ద గాయమే అయినట్లు సమాచారం. ఈ గాయం నుంచి కోలుకోవడానికి హిట్ మ్యాన్ కు కనీసం రెండు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవసరమట. ఇక ప్రపంచకప్కు ముందు రోహిత్ గాయపడడం టీమిండియాను కలవరపరుస్తోంది. వరల్డ్ కప్ కు ఎక్కువ సమయం కూడా లేదు. మే 30న ప్రారంభమయ్యే ప్రపంచకప్లో జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ లోపు రోహిత్ కోలుకోవాలని కోరుకుందాం. మరోవైపు ముంబయి ఇండియన్స్కు ఈ సీజన్ లో రోహిత్ మిగతా మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది ముంబయికి గట్టి ఎదురు దెబ్బ. ఇటు ముంబయి ఇండియన్స్తో పాటు అటు టీమిండియాలో కూడా రోహిత్ కీలక ఆటగాడు కావడంతో ఆయన గాయం ఇరు జట్లకు ఆందోళన కలిగిస్తోంది.