గుంటూరు, ఏప్రిల్ 10: చీరాల నియోజకవర్గంలో ఎలాగైనా తనను ఓడించాలని కుట్రలు పన్నిన టీడీపీ నేత కరణం బలరాం, 1000 మంది తన అనుచరులను నియోజకవర్గంలో దించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పోలీసులను ఆశ్రయించారు. వారంతా వివిధ గృహాలు, హోటళ్లలో మకాం వేసి విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, రేపటి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్నదే వారి లక్ష్యమని ఆరోపిస్తూ, ఎన్నికల కమిషన్ అధికారులకు, చీరాల డీఎస్పీకి ఆమంచి ఫిర్యాదు చేశారు.
వేరే ప్రాంతాల నుంచి వారంతా వచ్చారని, వారిని గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆమంచి ఫిర్యాదు చేశారు. కాగా, నిన్నటి నుంచే చీరాల పరిధిలోని హోటళ్లన్నింటినీ తనిఖీ చేస్తున్నామని, హోటళ్లలో బయటి నియోజకవర్గాలకు చెందిన వారుంటే అదుపులోకి తీసుకుని వారిని పంపేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.