పశ్చిమ గోదావరి, ఏప్రిల్ 09: పాలకొల్లు రాజకీయాల్లో మార్పు కోసం అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన పార్టీ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రచారం చివరి రోజున పాలకొల్లులో జనసేన భారీ సభ నిర్వహించింది. ఈ సభకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హాజరవడం ఆసక్తి కలిగించింది.
ప్రచార సభలో అల్లు అర్జున్ జనసేనానితో పాటు వేదికపై కనిపించాడు. సింపుల్ డ్రెస్ లో వచ్చిన బన్నీ, పవన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. బన్నీ రాకతో నరసాపురం నియోజకవర్గంలోని జనసైనికుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
ఎన్నికల ప్రచారం మొదట్లో మెగా కాంపౌండ్ హీరోలెవరూ జనసేన ప్రచారంలో పాల్గొనకపోయినా చివరి దశలో మాత్రం క్యూలు కట్టారు. వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబు, మరికొందరు జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేయగా, పవన్ కు అస్వస్థత కలిగిందని తెలియగానే రామ్ చరణ్ హుటాహుటీన విజయవాడ చేరుకున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా రావడంతో జనసేన వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.