హైదరాబాద్, ఏప్రిల్ 09: కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన కలప స్మగ్లర్, తెలంగాణ వీరప్పన్గా పిలిచే ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీనును నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. అటవీశాఖాధికారులతో పాటు పోలీసులకు గత 20 ఏళ్లుగా కలప అక్రమ రవాణా చేస్తూ సవాలుగా మారాడు.
రామగుండం కమిషనరేట్ పోలీసులు శ్రీనుతో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఎడ్ల శ్రీను రెండు నెలలుగా విజయవాడ, విశాఖ, అన్నవరం, భద్రాచలం ప్రాంతాల్లో రెండు రోజులుగా తల దాచుకున్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీను కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కొద్ది రోజుల క్రితం అక్రమ కలప డంపు డ్రోన్ కెమెరా సాయంతో స్వాధీనం చేసుకున్నారు.
తన కలప డంపులను పోలీసుల కంట పడకుండా చేసేందుకు మంథని మండలం విలోచవరం గ్రామానికి చేరుకున్న శ్రీనును పోలీసులు కాపుగాసి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, 1999లో ఫర్టిలైజర్స్ వ్యాపారం చేసిన శ్రీను అందులో నష్టాలు రావడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.
ఎడ్ల శ్రీనుకు వరంగల్, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ‘తెలంగాణ వీరప్పన్’గా పేరున్నట్టు తెలిపారు. శ్రీనుకు సహకరించిన రాజకీయ పార్టీల నేతలు, పోలీసు, అటవీశాఖ అధికారులు గురించి ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో ఎడ్ల శ్రీనుతోపాటు వడ్ల సంతోష్, మధుకర్, కిషన్, శ్రీనివాస్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.