న్యూఢిల్లీ, ఆగస్ట్ 15: స్మార్ట్ఫోన్స్ విరివిగా వాడకంలోకి వచ్చిన తరుణంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఫోన్కే అంకితమవుతున్నారు. గేమ్స్, మ్యూజిక్, సామాజిక మాధ్యమ వేదికగా కూడా ఉపయోగపడుతుంది. ఒక మిని కంప్యూటర్ మాదిరిగా పనిచేస్తున్నాయి స్మార్ట్ఫోన్స్, అయితే వీటితో ఉపయోగాలే కాదు, అనర్ధాలు కూడా చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఇటీవల వెలుగు చూసిన బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్. స్మార్ట్ఫోన్ని వేదికగా చేసుకుని విడుదల చేసిన ఈ గేమ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పిల్లలు మరణించారు. తాజాగా భారత్లోని పశ్చిమ మిడ్నాపూర్, ముంబైలో ఇద్దరు పిల్లలను బలిగొంది. ఒక బాలుడు బిల్డింగ్ పై నుంచి దూకగా, ఇంకో బాలుడు పాలిథీన్ కవర్ తో ఊపిరాడకుండా చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఫేస్ బుక్, వాట్స్ యాప్, ఇన్స్టాగ్రామ్ల నుంచి తక్షణం బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్కు సంబంధించిన లింకుల్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దగ్గర తల్లిదండ్రులు ఈ గేమ్ను తక్షణం నిషేధించాలని ఆవేదన వ్యక్తం చేయగా, అంతర్జాల దిగ్గజ సంస్థలకు ఈ గేమ్ ను తొలగించాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నెల 11న లేఖ రాసింది. ఈ గేమ్ మొదటగా 2013లో రష్యాలో ప్రారంభమైంది. ఈ ఛాలెంజ్లో 49టాస్క్లు ఉండి 50రోజుల గడువుతోఉంటుంది. మెల్లమెల్లగా చిన్నచిన్న టాస్క్లతో గెలిచేలా చేస్తూ, పూర్తిగా దానికి అలవాటు పడిన తర్వాత దానిలోని అసలు రంగు బయట పడుతుంది. ఈ గేమ్ లో టాస్క్ పూర్తి చేసినట్టు సాక్ష్యం పెట్టాలని కోరుతుంది. దానిని పెట్టిన తరువాత అభినందిస్తుంది. ఆ అభినందనలకు అదెలా చెబితే పిల్లలు అలా చేస్తారు. ఇదే ప్రమాదకరంగా ఉంది.