హైదరాబాద్, ఆగస్ట్ 15 : హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాన్ని గుర్తు చేశారు. అమరుల త్యాగాల వల్లే ఏడు దశాబ్దాలుగా దేశ ప్రజలు స్వేచ్ఛ ఫలాలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు. అయితే, స్వేచ్ఛ సంపదలు ఇంకా అట్టడుగు వర్గాల వారికి దూరంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సాంఘిక అసమానతలు పేదరికం పెదగా మిగలనప్పుడే స్వాతంత్ర్యానికి అర్థం పరమార్థం అన్నారు పవన్. అటువంటి రోజు కోసం భారత జాతి మొత్తం కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. జనసేన పార్టీ తరుపున తెలుగు ప్రజలందరికి పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.