ఆ జాబితాలో టీడీపీ ప్రథమస్థానంలో

SMTV Desk 2019-04-04 18:38:03  TDP, Google ads

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు 8 రోజులు ఉండగా.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఒకవైపు ఇంటింటికి తిరుగుతూనే, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయా పార్టీలు ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే, గూగుల్‌లో ఎక్కడ చూసినా.. ఫలానా గుర్తుకే ఓటేయండి అంటూ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. అటు యూట్యూబ్‌లోనూ యాడ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ ఇండియా ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్ ప్రకారం వాణిజ్య ప్రకటనల కోసం ఫిబ్రవరి 19 నుంచి ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందో వివరాలు వెల్లడించారు.

ఈ జాబితాలో టీడీపీ ప్రథమస్థానంలో ఉంది. ఆ పార్టీ మొత్తం 89 యాడ్స్ కోసం రూ.1.48 కోట్లు ఖర్చు చేసిందని సమాచారం. ఆ తర్వాత జాతీయపార్టీ బీజేపీ 554 వాణిజ్య ప్రకటనల కోసం రూ.1.21 కోట్ల రూపాయలు కేటాయించింది. మూడవ స్థానంలో ఉన్న వైసీపీ 107 యాడ్స్ కోసం రూ.1.04 కోట్లు ఖర్చు చేసింది. ఇది ఇలా ఉంటే టీడీపీ కోసం ప్రామాణ్య స్ట్రాటజీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, డిజిడెంట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా వాణిజ్య ప్రకటనలు రూపొందించాయి. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే.. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల యాడ్స్ కోసం కేవలం 54,100 రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. 14 యాడ్స్‌తో ఆ పార్టీ గూగుల్‌లో ప్రచారం చేసింది.