గుంటూరు, ఆగస్ట్ 15: భారత దేశం నలుమూలల 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మిన్నంటుతున్నాయి. అయితే గుంటూరు జిల్లాల్లోని పెదకూరపాడు ఎంపీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ సంఘటనలో మాత్రం జాతీయ జెండాకు అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జాతీయ జెండాను తలకిందులగా ఎగురవేశారు. దీంతో అక్కడున్న పలువురు మండిపడ్డారు. ఈ ఉదయం పెదకూరపాడు ఎంపీపీ కార్యాలయంలో జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా పతాకావిష్కరణ అనంతరం పొరపాటును గ్రహించిన ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది జెండాను సరిచేశారు. దీనిపై ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ కారకులైన వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు.